
ఆరు గ్యారంటీలు ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల జారీ (New Ration Cards), ఇందిరమ్మ ఇళ్లు పథకాల అమలుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి కొత్త పథకాల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. ఈ నెల 24 వరకు సభలు నిర్వహించి, లబ్ధిదారుల ఎంపికకు తుది కసరత్తు జరగనుంది.
కొత్త దరఖాస్తుల స్వీకరణ
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల కోసం నేటి నుంచి తుది కసరత్తు జరగనుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన వారి నుంచి కుటుంబ సభ్యులు, ఆధార్, ఫోన్ నంబరు, కులం, చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు గ్రామ, వార్డు సభల్లో సమర్పించవచ్చు.
తొలి విడతలో వారికే ఇళ్లు
తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. సుమారు 31 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించాయి. ఇందులో సొంత ఇంటి స్థలం ఉన్న వారు 18 లక్షలు ఉండగా.. స్థలం లేని కుటుంబాలు 12 లక్షలు ఉన్నాయి. వీరిలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bedroom Houses) కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.