
హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు (Hyderabad IT Raids) కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాలు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితా రెడ్డికి సంబంధించిన ఇండ్లు, ఆఫీసులు, దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
పుష్పరాజ్ ఎఫెక్ట్
ఇక తాజాగా పుష్ప-2 (Pushpa 2) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సీఈఓ చెర్రీ, సంస్థ సంబంధీకులు, వ్యాపార భాగస్వాముల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 50 బృందాలు నగరంలోని పలు చోట్లు ఏకకాలంలో దాడులు చేస్తుండటం గమనార్హం. అయితే ఐటీ అధికారులు గత కొంతకాలంగా సూపర్ హిట్స్ కొట్టిన ప్రొడ్యూసర్లపై దాడులు చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
మ్యాంగో మీడియాపైనా దాడులు
మరోవైపు మైత్రీ మూవీ సంస్థ(Mythri Movie Makers)పై ఐటీ దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఈ సంస్థలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక ఇటీవలే పుష్ప-2 సినిమాతో ఈ సంస్థ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న తమ నటవిశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ జైహనుమాన్ సినిమాలు రావాల్సి ఉన్నాయి. మరోవైపు మ్యాంగో మీడియా (Mango Media) సంస్థల పై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.