Mana Enadu : ఇటీవల విమానాల(Flight Threats)కు బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయి. వరుస బెదిరింపులతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. బాంబు ఉందంటూ ఫోన్ రాగానే పరుగున వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. తీరా చూస్తే అవి ఫేక్స్ కాల్స్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫేక్ అని రిలాక్స్ అయినా.. తరచూ ఈ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ (Threatening Calls) రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించింది. దేశంలోని వివిధ విమానయాన సంస్థలు నడుపుతున్న 100కుపైగా విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో 16 రోజుల వ్యవధిలో 510కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ కుట్ర వెనకాల ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఈ బెదిరింపుల వెనుక ఉంది గోండియాకు చెందిన జగదీశ్ ఉయికే అనే పుస్తక రచయిత అని గుర్తించినట్లు నాగ్పుర్ పోలీసులు తెలిపారు. గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రచించిన ఈ వ్యక్తి 2021లో ఓ కేసులో అరెస్టయ్యాడని.. ఈ వ్యక్తే ఈ-మెయిల్ (Bomb Threat Mails) ద్వారా పలు విమానయాన సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపించాడని వెల్లడించారు.






