అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో ఇన్వెస్టర్లంతా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుపై (31.10 గ్రాములు) 3200 డాలర్ల మార్కును దాటి రికార్డు గరిష్ట స్థాయికి చేరింది.
భారీగా పెరిగిన పసిడి ధర
దేశీయ మార్కెట్లలోనూ గోల్డ్ రేట్లకు (Gold Rates Today) రెక్కలొచ్చాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2940 పెరిగి 10 గ్రాములకు రూ. 93,380 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి రేటు ఒక్కరోజులో రూ. 2700 పెరగడంతో తులం ధర రూ. 85,600కు చేరింది. ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల గోల్డ్ తులం ధర రూ. 85,750, , 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాముల రేటు రూ. 93,530 వద్ద పలుకుతోంది.
పసిడి బాటలోనే వెండి రేట్లు
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు (Silver Price Today) కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో రూ. 4 వేలు పెరిగి కేజీకి రూ. 97 వేలకు చేరింది. హైదరాబాద్ నగరంలో రూ. 5 వేలు పెరిగి కిలో ధర రూ. 1.07 లక్షల మార్కును తాకింది. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడంతో కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకడుగేస్తున్నారు. శుభకార్యాలు ముందుండటంతో ఈ సమయంలో గోల్డ్ రేట్లు పెరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.






