
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థుల(School Students)కు తీపికబురు వచ్చేసింది. చిన్నారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాఫ్ డే స్కూల్స్(Half Day Schools) రేపటి నుంచి కొనసాగనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు(Summer Temperatures)రోజురోజుకీ పెరిగిపోతుండటంతో AP, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఒకపూటే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింటికీ వర్తించనున్నాయి.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు
కాగా తెలంగాణ(Telangana)లో హాఫ్ డే స్కూళ్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అలాగే ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరుగుతాయి. ఉక్కపోత, వేడి గాలులకు విద్యార్థుల ఇబ్బందులు పడకుండా.. వారి సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం(New Academic Year) ప్రారంభం కానుంది.
ఈసారి 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
కాగా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వేసవి ప్రతాపం అధికంగా ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక వడగాలులు ఈ నెల మూడో వారం నుంచి ప్రతాపం చూపించనున్నాయి.