హైదరాబాద్ మహానగరంలో రెండోరోజూ సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల దాడులు (Hyderabad IT Raids) కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలల్లో సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 (Pushpa 2) చిత్రబృందంపై ఐటీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
సుకుమార్ ఇంట్లో తనిఖీలు
ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ (Mythri Movie Makers)పై ఐటీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండో రోజు ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు పుష్ప-2 సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ తనిఖీలు చేస్తోంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి సుకుమార్ ను తీసుకెళ్లిన ఐటీ అధికారులు… ఆయన నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు.
రెండో రోజు సోదాలు
మరోవైపు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసాలు, కార్యాలయంలో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా (Mango Media IT Raids) కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.






