ఓ నిర్మాణ సంస్థ నుంచి రూ.9 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు తమిళ నటుడు జయం రవి(Jayam Ravi). నష్టపరిహారం ఇప్పించాలని చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్కు చెందిన బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూవీ నిర్మాణ సంస్థకు (BTG Universal) రెండు సినిమాలు చేసేందుకు జయం రవి (రవి మోహన్) గతంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు గానూ రూ.6 కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నాడు. అయితే రవిమోహన్ తమ సంస్థకు మూవీస్ చేయకుండా ఇతర చిత్రాలను చేస్తున్నారని, ఈనేపథ్యంలో తామిచ్చిన అడ్వాన్స్ను వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని చైన్నె సిటీ కోర్టులో ఆ సంస్థ పిటిషన్ వేసింది.
నిర్మాణ సంస్థ నా సమయాన్ని వృథా చేసింది
ఆ పిటిషన్పై జయం రవి స్పందించారు. నిర్మాణ సంస్థ తన సమయాన్ని వృథా చేసిందని, తనకే నష్టపరిహారం చెల్లించేలా చూడాలని చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ సంస్థకు తాను కేటాయించిన కాల్షట్స్ను ఆ సంస్థ ఉపయోగించుకోలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను మరో మూవీ చేసి తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి ఇస్తానని చెప్పానని తెలిపారు. కానీ వారం రోజుల్లోనే ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఆ సంస్థ ఒత్తిడి చేసిందని పేర్కొన్నారు.
మరో సినిమాకు కాల్షీట్స్ ఇవ్వలేకపోయా..
సంస్థకు తాను కేటాయించిన కాల్షీట్స్ను ఉపయోగించుకోకుండా తన సమయాన్ని వృథా చేసిందని జయం రవి పేర్కొన్నారు. ఫలితంగా తనకు నష్టం జరిగిందని తెలిపారు. వారి సినిమాకు ఒప్పుకున్నందున తాను మరో సినిమాకు కాల్షీట్స్ ఇవ్వలేకపోయానన్నారు. దీంతో ఆ నిర్మాణ సంస్థే తనకు రూ. 9 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును కోరారు. అయితే ఈ ఇద్దరి పిటిషన్లపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.






