Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసు (Hyderabad Formula E Race Case) వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై కేటీఆర్ (KTR High Court Petition) క్వాష్ పిటిషన్ వేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత పిటిషన్ విచారించాలని కేటీఆర్ కోరారు. ఈ క్రమంలో ఇవాళ ఈ వ్యాజ్యం కోర్టు ముందు విచారణకు రానుంది. అయితే లంచ్ మోషన్ను సింగిల్ బెంచ్ తిరస్కరించడంతో.. సీజే బెంచ్ ముందు పిటిషన్ను దాఖలు చేశారు.
రూ.54 కోట్ల నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే కేటీఆర్ (KTR ACB Case) పై అభియోగం నమోదైంది. ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.54,88,87,043 కోట్లను యూకేకు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్’ (ఎఫ్ఈఓ) కంపెనీకి హిమాయత్నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ చేయించారని ఎఫ్ఐఆర్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఏ1గా కేటీఆర్
ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (IAS Arvind Kumar), ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఇతరులపై కేసు నమోదయింది. ఐసీపీ (బీఎన్ఎస్) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్ 409, 120 (బీ) సెక్షన్స్ కింద అభియోగాలు నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణ కోసం ఏసీబీ ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.






