Mana Enadu : ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati Works)కి మహర్దశ వచ్చేసింది. ఇప్పటికే 6,700 కోట్ల రుణాన్ని ఏడీబీ (Asian Development Bank) మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా అమరావతికి రుణం మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది. గురువారం రోజున జరిగిన వరల్డ్ బ్యాంక్ బోర్డు (World Bank Board Meeting) సమావేశంలో అమరావతి నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. గతంలో అమరావితికి నిధులు ఇస్తామని, ప్రపంచ బ్యాంకు, ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
వరల్డ్ బ్యాంకు, ఏడీబీల ద్వారా 13,500 కోట్ల నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ఏడీబీ 6,700 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించగా.. తాజాగా వరల్డ్ బ్యాంకు కూడా రూ.6800 కోట్ల మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 33,137.98 కోట్ల రూపాయలతో 45 ఇంజినీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సీఆర్డీఏకి (Capital Region Development Authority) రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు.. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి సీఆర్డీఏకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్పష్టం చేశారు. 2025 జనవరిలో రూ. 62 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.






