
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న పర్యటకులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఛార్జీలు లేకుండా ఉచితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరోవైపు భయంతో హోటళ్లు ఖాళీ చేస్తున్న పర్యటకులకు కొందరు స్థానికులు ఉచిత ఆవాసం కల్పిస్తున్నారు.
ఇది కశ్మీర్ ఆత్మపై జరిగిన దాడి
కశ్మీర్ లో ఆటో డ్రైవర్(Free Auto Ride in Kashmir) గా పని చేస్తున్న బిలాల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఇది పర్యటకుల మీద జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్ ఆత్మపై జరిగిన దాడి అని అన్నారు. తమ ప్రాంతానికి అతిథులుగా వచ్చిన వారంతా ఇప్పుడు భయంతో వెళ్తుండటం చాలా బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవదంపతులు వచ్చి ఎయిర్ పోర్టుకు ఎలా వెళ్లాలో అని చాలా భయంతో అడగడం తనను కలచివేసిందని చెప్పారు. వారికి ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పేర్కొన్నారు.
చాలా బాధగా అనిపిస్తోంది
“నా వద్దకు భయపడుతూ వచ్చిన నవదంపతులకు నేను ధైర్యం చెప్పాను. వారిని సురక్షితంగా ఎయిర్ పోర్టు వద్ద వదిలాను. వారు నాకు డబ్బు ఇచ్చేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ప్రాణభయంతో వణుకుతున్న వారి నుంచి నేను డబ్బు ఎలా తీసుకోగలను. మా ప్రాంతానికి అతిథులుగా వచ్చిన వారంతా ఇలా భయపడుతూ వెళ్లడం చాలా బాధగా అనిపిస్తోంది.” అని ఆటో డ్రైవర్ బిలాల్ అహ్మద్ తెలిపారు.
ఉదారత చాటుకున్న డాక్టర్
ఇక శ్రీనగర్కు చెందిన ఓ డాక్టర్ తన ఉదారతను చాటుకున్నారు. తన ఇంటినే హోటల్గా మార్చి పర్యటకులకు ఉచితంగా ఆవాసం కల్పించారు. అధిక ధరలు, హైవే మూసివేత కారణంగా ఇబ్బంది పడుతున్న పర్యటకులు తన ఇంటిని ఆవాసంగా ఉపయోగించుకోవచ్చని డాక్టర్ ఇర్ఫాన్ చెప్పారు. మరోవైపు ఉగ్రదాడి వల్ల పహల్గామ్లోని దాదాపు 95శాతం పర్యటకలు హోటళ్లు ఖాళీ చేసి వెళ్లారు.