
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ అకాల వర్షాలు ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు గంటకు 30 నుంచి 40KM వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. కాగా పంటలు చేతికొచ్చే సమయం కావడంతో అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఎండలు కూడా పెరిగే అవకాశముందంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా 2.9 డిగ్రీలు పెరిగి 43.8 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు(Temparatures) నమోదవుతున్నాయని పేర్కొంది.