
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దక్షిణ రాయలసీమపై ద్రోణి ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని అంచనా వేసింది. అలాగే AP, తెలంగాణ 7 రోజులపాటూ.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అదే సమయంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల మేర పెరుగుతాయని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లరాదని సూచించింది.
గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు
ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ (ఏప్రిల్ 18) తీర ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగం గల గాలులతో ఉండవచ్చు. రాయలసీమ, ఇతర ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల వర్షం పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులారా జాగ్రత్త..
అటు తెలంగాణ(Telangana) విషయానికొస్తే, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుముల(thunders)తో కూడిన వర్షాలు, గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. అయితే, అకాల వర్షాల వల్ల రైతులు(Farmers) జాగ్రత్తగా ఉండాలని సూచించింది.