వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు భారీ షాక్ తగిలింది. ఆరేళ్ల క్రితం కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు (Andheri Magistrate court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేల్చింది. మరోవైపు మూడు నెలలు జైలుశిక్ష కూడా విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఆరేళ్ల కిందటి కేసు
ముంబయిలో 2018లో రాంగోపాల్ వర్మపై చెక్బౌన్స్ కేసు (cheque bounce case) నమోదయింది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు.
మూడు నెలలు జైలుశిక్ష
వర్మ తీరుతో ఆగ్రహించిన కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ (non bailable warrant issued) చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని యెడల మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తాజాగా మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది. దీనిపై ఆర్జీవీ స్పందించాల్సి ఉంది.






