
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఒక ఉన్నతస్థాయి కమిటీ(High level committee)ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే సమ్మె నిర్ణయం తాత్కాలిక వాయిదా మాత్రమేనని ఉద్యోగ సంఘాల నాయకులు(Leaders of trade unions) స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం
కాగా తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం TGSRTC JAC నేతలు ఇటీవల సమ్మె(Strike)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 6వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందకపోతే, మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కార్మికులు భారీ కవాతు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం చొరవ తీసుకుని జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది.
ముగ్గురు సీనియర్ IAS అధికారులతో..
మంత్రి పొన్నం ప్రభాకర్తో JAC నేతలు జరిపిన సమావేశంలో కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గాలను సూచించేందుకు ముగ్గురు సీనియర్ IAS అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ చర్చలు జరిపి, వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.