ManaEnadu:బ్యాంకు ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఎస్బీఐ తీపి కబురు చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. కస్టమర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. సాధారణ బ్యాంకింగ్ అవసరాలతోపాటు, బ్యాంక్ సాంకేతికతను అప్గ్రేడ్ చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
10వేల ఉద్యోగాలు
టెక్నాలజీ రిక్రూట్మెంట్ ద్వారా డేటా సైంటిస్టులు, డేటా ఆర్కెటెక్ట్లు, నెట్వర్క్ ఆపరేటర్లు మొదలైన సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని శ్రీనివాసులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసరాల దృష్ట్యా 8000 నుంచి 10,000 మంది ఉద్యోగులను నియమిస్తామని తెలిపారు. వీరిలో సాధారణ బ్యాంకింగ్ సేవలు అందించేవారితోపాటు, సాంకేతిక నిపుణులు కూడా ఉంటారని వివరించారు.
600 కొత్త శాఖలు ప్రారంభిస్తాం
2024 మార్చి నాటికి ఎస్బీఐలో 2,32,296 మంది ఉద్యోగులు ఉండగా.. 1,10,116 మంది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 600 కొత్త శాఖలను ప్రారంభించాలనుకుంటున్నాం. ఎస్బీఐకు దేశవ్యాప్తంగా 65,000 ఏటీఎంలు ఉన్నాయి. అలాగే 85,000 బిజినెస్ కరస్పాండెట్లు ఉన్నారు. ఈ నెట్వర్క్ ద్వారా సుమారు 50 కోట్ల మంది వినియోగదారులకు ఎస్బీఐ సేవలు అందిస్తోంది. అని ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు.
అదే మా లక్ష్యం
కాలం గడుస్తున్న కొలదీ కస్టమర్ల అవసరాలు పెరుగుతున్నాయని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోందని.. విస్తృతస్థాయిలో డిజిటలైజేషన్ జరుగుతోందని చెప్పారు. అందుకే ఎస్బీఐ ఉద్యోగులకు కాలానుగుణంగా రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి భారతీయునికి, అలాగే ప్రతి భారతీయ కుటుంబానికి బ్యాంకర్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఎస్బీఐని అత్యుత్తమ బ్యాంక్గా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.








