Mana Enadu : దేశంలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (నవంబరు 26వ తేదీ) రోజున షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh News), ఒడిశా (Odisha), బెంగాల్ (West Bengal), హర్యానా (Haryana) రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ.. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
- ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే..?
- ఏపీ – 3
- ఒడిశా – 1
- బెంగాల్ – 1
- హర్యానా -1
డిసెంబరు 20న పోలింగ్
ఈ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10ని తుది గడువుగా నిర్ణయించిన ఈసీ (Election Commission Of India).. 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇక డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే రోజు 5 గంటల నుంచి లెక్కింపు ఉంటుందని పేర్కొంది.
వారి రాజీనామాతో ఉపఎన్నికలు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య (R.Krishnaiah) రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యం అయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను టీడీపీ (TDP), జనసేన, బీజేపీ (BJP) కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన(Janasena)కు అవకాశం ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.