Mana Enadu: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate Rainfall) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. గురువారం ADB, నిజామాబాద్, కరీంనగర్, MDK, HYDతో పాటు మేడ్చల్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక (Yellow alert)ను జారీ చేసింది. కాగా బుధవారం బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
ఓవైపు వర్షం.. మరోవైపు చలి
రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఇదిలా ఉండగా అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో లా నీనా ఏర్పడినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో HYDలో ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే గత మూడు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
ఏపీలోనూ వానలు
ఆంధ్రప్రదేశ్ని వర్షాలు వీడటం లేదు. ఇవాళ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతి, YSR, అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Weather Station) సూచించింది.