తెలంగాణ గాంధీ..కొండా లక్ష్మణ్ బాపూజీ

మలిదశ తెలంగాణ పోరాటయోధుడు, నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన వీరుడు,జన్మాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, సామాజిక తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన మహనీయుడు, రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగి, మూడుతరాల ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి వర్యులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ…

తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ కోసం పాటు పడ్డారు. ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో, ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం. తన ఆస్తి పాస్తులను, జీవితాన్ని మొదట్లో స్వతంత్ర ఉద్యమం కోసం, తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కోసం అవిరైనా.. ఏమాత్రం ఆలోచించకుండా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని కొనసాగించిన మహానేత.

నిజాం పాలనపై నిప్పుల యుద్దం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. నిజాంను ధైర్యంగా ఎదర్కొన్న ధీశాలి ఆయనే. బాపూజీ పోరాటాల చాప్టర్లు ఐదు రకాలుగా విడదీసుకోవాలి. నిజాంమీద పోరాటం మొదటిది. భారత స్వతంత్ర ఉద్యమం రెండోది. ముల్కీ ఉద్యమం మూడోది. 1969 తెలంగాణ పోరాటం నాలుగోది. తాజాగా జరిగిన తెలంగాణ ఉద్యమం ఐదోది.

భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయారు. బాధలనుండి విముక్తి దొరకాలంటే, ప్రత్యేక రాష్ర్టం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతీ సారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు.

 

పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా కూడ అనుక్షణం ప్రజలవైపే నిలబడ్డారు బాపూజీ. తన ప్రాణాల మీదకు వచ్చినా సరే, నమ్ముకున్న బాటను వీడిచి పెట్టలేదు. అందుకే, బాపూజీ మూడుతరాలవారికి తెలంగాణ ఉద్యమ వారధిలా నిలిచారు. అలనాటి నిజాం సంస్థానంలోని వాంకిడిలో 1915లో సెప్టెంబర్ 27న జన్మించారు బాపూజీ. తొంభై ఏడో ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఈ లోకంలో ఉన్న 97 ఏళ్ళూ కూడా అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు.

 

1952 ప్రాంతాల్లో ముల్కీ ఉద్యమంలో మొదలైంది తెలంగాణ కోసం పోరాటం. 1969లో….అంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఉద్యమం పదును పెంచడానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. ఆ సమయంలో తెలంగాణలోనే తన రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పి.. అప్పటి నుంచి రాజకీయాలను నుంచి తప్పుకుని తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలో యువతకు స్పూర్తిని కల్పించారు.

 

ఇటీవలి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 ఏళ్ల వయస్సులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిముషం వరకూ చిత్త శుద్దితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు. 1952లో అసిఫాబాద్ నుంచి గెలిచి చట్ట సభలో అడుగు పెట్టారు బాపూజీ.

 

చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు. అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరయ్యారు. మంత్రివర్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. చేయాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేసేవారు. ముఖ్యమంత్రి పదవి రెండుసార్లు ఆయనను వరించబోయింది. కానీ, చివరిక్షణాల్లో వేరేవాళ్ళు ఎగరేసుకుపోయారు. వెనకబడితన తరగతులకు చెందిన వ్యక్తి కావడంవల్లనే ముఖ్యమంత్రి కాలేకపోయారని బాపూజీ శిష్యులంటారు.

 

తన ఆస్తులను, జీవితాన్ని జనం కోసం ధారపోసిన ఈ నాయకుణ్ణి మన ప్రభుత్వాలు నిలువునా మోసం చేశాయి. ఆయన ఆస్తుల్లో జలద్రుశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రం అయింది. తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ పుట్టింది అక్కడే. అలాంటి మహానేత పరమపదించిన సమయంలో ఢిల్లీలో వున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం బాపూజీ కడసారి చూపుకోసమే.. అంతక్రియల సమయానికి కూడా హాజరుకాకపోవడంతో ఆయన శిష్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తించి సవినయంగా స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది.

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి అధికారికంగా చేయడం నిజంగా హర్షణీయం.

ఆలేటి రమేశ్

9948798982.

Share post:

లేటెస్ట్