మన ఈనాడు:TSPSC ఉద్యోగార్థుల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా లేదు. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షపై సందిగ్ధం ఏర్పడింది.పదిరోజులే మిగిలున్నప్పటికీ పరీక్ష నిర్వహణ కోసం కమిషన్ ఏర్పాట్లు చేయకపోవడంతో మరోసారి వాయిదా పడే అవకశాలు ఉన్నాయని తెలుస్తుంది.
పేపర్ లీకేజీ, అనంతర పరిణామాలతో పరీక్షల రద్దు, వరుస వాయిదాలు అభ్యర్థులను తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనుచేశాయి. ఇక రాష్ట్రంలో రెండో అత్యు్న్నత పోస్టుగా భావించే గ్రూప్-2 పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వెలువడిన రెండో గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇది. 783 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా దాదాపు 5.50లక్షల మంది దరఖాస్తు చేశారు. దాదాపు ఏడేళ్ల అనంతరం వెలువడిన నోటిఫికేషన్ కావడంతో అభ్యర్థులు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి లైబ్రరీలకే పరిమితమై సన్నద్ధమవుతున్నారు. అయితే, వరుస వాయిదాలు వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి.
కొత్త ప్రభుత్వంలో పాత నోటిఫికేషన్లపై ఇంకా అభ్యర్థులకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, దాదాపు నెల క్రితం గ్రూప్-2 పరీక్ష కోసం సెంటర్లను సిద్ధం చేయడానికి టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పరీక్ష జరిగే అవకాశముందని అభ్యర్థులు భావించారు. కానీ, ఆలోగానే టీఎస్పీఎస్సీ సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఇటీవలే ఉద్యోగ భర్తీ ప్రక్రియపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష, టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల రాజీనామా, యూపీఎస్సీ సహా ఇతర బోర్డుల పనితీరుపై అధ్యయనం చేసేలా కమిటీ కోసం సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం.. తదితర పరిణామాల నేపథ్యంలో గతంలో రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్ -2 పరీక్ష మరోసారి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ లక్షలాది మంది ఆశావహుల ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఉన్నాయి.
మరోవైపు ఎన్నికల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు దిశగా ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ఏర్పాటు అనంతరమే నియామక పరీక్షలు ముందుకెళ్లే అవకాశముందని నిపుణులు వెల్లడిస్తున్నారు.