Telangana Rains: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంగా కారణంగా రాష్ట్రంలో నేటి నుంచి రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో గతకొన్ని రోజులుగా వర్షాలు కురవటం లేదు. జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టగా.. ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ కనిపించలేదు. రైతులకు ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మెుక్కలు ఎదిగే దశ కాబట్టి వర్షం అవసరం. అయితే చాలా రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. హైదరాబాద్లో అడపాదడపా వర్షాలు మినహా.. జిల్లాల్లో మాత్రం వరుణుడు పలకరించలేదు. దానికి తోడు ఎండ తీవ్రత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రైతులకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. ఆవర్తనం ఈశాన్యాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్యలో ఉందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది
జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ కాకినాడ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వానలు కురుస్తాయన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.