కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలే..KCR కాపీ

మన ఈనాడు:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టి బీఆరెస్ మేనిఫెస్టో ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్ నేతలు అదెలా సాధ్యమన్నారు కానీ ఇప్పుడు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. బీఆరెస్ తన ఉనికిని కోల్పోయింది…. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారని సెటైర్ వేశారు. బీఆరెస్ కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ మేనిఫెస్టోను కాంగ్రెస్ ఒక చిత్తు కాగితంగా చూస్తోందని దానిపై చర్చ అనవసరమన్నారు రేవంత్ రెడ్డి.
“మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నాడు… పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు… మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే… రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది” అన్నారు రేవంత్ రెడ్డి.

బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్ లో చూపించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని.. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్, బీఆర్ఎస్ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. కేసీఆర్, ఆయన పార్టీ పరాన్నజీవులు. పక్కవాళ్ల మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీలో లోపించాయనడానికి వాళ్ల మేనిఫెస్టోనే నిదర్శనమని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Share post:

లేటెస్ట్