CM Revanth Reddy : అంగన్‌వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్‌ విధానం..సీఎం రేవంత్ కీలక ఆదేశం.!

అంగన్వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ ల్ మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్:
ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని సీఎం అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా? లేదా? పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు.

పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు:
జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే శానిటరీ నాప్కిన్స్ వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించి, నాప్కిన్స్ పంపిణీ చేయాలని చర్చ జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు.

అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్ :

రాష్ట్రంలో ఉన్న వాటిలో ఇప్పటికే 12315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే డిజైన్తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు. చూడగానే ఆకర్షించేలా అంగన్వాడీ కేంద్రాల భవనాలన్నింటికీ ప్రత్యేకంగా డిజైన్ చేయాలని చెప్పారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

Share post:

లేటెస్ట్