Mana Enadu: మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందరికంటే ముందే ప్రకటించిన బీజేపీ అభ్యర్థి ఓ వైపు ప్రచారంలో దూసుకపోతున్నారు. తన గెలుపుకు అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీజేపీ పదునైన విమర్శలు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కారు నేతల తీరు చూస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సిట్టింగ్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే నాయకుడే లేడానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇద్దరు, ముగ్గురు పేరు పరిశీలిస్తుంది. గురువారం బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ తొలుత మల్లారెడ్డి అల్లుడు ఆతర్వాత కొడుకు అనుకున్నారు. చివరకు మల్లారెడ్డి పోటీలో ఉండటం లేదని తప్పుకున్నారు. ఒక్కసారిగి శంబీపూర్ రాజు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో ఉప్పల్ టిక్కెట్ ఆశించి భంగపడి బీఆర్ఎస్లో చేరిన నేతలకు పార్లమెంటు అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడం పట్ల కేసీఆర్ ఆలోచనలు అంతుచిక్కడం లేదు.
ఈటెల గెలుపు కోసమే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తీరు ఉందని రాజకీయ వర్గాల నేతలు భావిస్తున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించినా అవకాశం ఇవ్వలేదు. రేవంత్రెడ్డి సిట్టింగ్ స్థానంపై బలమైన అభ్యర్థిని నిలబెట్టలేని కేసీఆర్ గులాబీ జెండా పీకేసినట్లేనా అనే ప్రచారం జరుగుతుంది.