Mana Enadu:కర్ణాటక రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కన్నడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నందున ప్రజా జీవితానికి దూరంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
దీనిపై తాజాగా యడియూరప్ప స్పందిస్తూ.. కోర్టు తీర్పుతో వాస్తవాలు బయటకు వస్తాయని, ఆ తర్వాత ఎవరు రిటైర్ అవుతారో చూసుకుందామని సవాల్ చేశారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ రిటైర్మెంట్ చేసి ఇంటికి వెళ్లే టైం అయిందంటూ దీటుగా బదులిచ్చారు. తన కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత నిజం బయటపడుతుందని.. అప్పటివరకు తానేమీ మాట్లాడనని, సీఎం తనకు నచ్చిన విధంగా మాట్లాడుకోవచ్చని అన్నారు.
యడియూరప్పై ఉన్న కేసు ఏంటి..?
ఓ కేసులో సాయం చేయాలంటూ వచ్చిన 17ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. జూన్ 27న ఛార్జ్షీట్ దాఖలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న యడియూరప్ప రాజకీయాల నుంచి వైదొలగాలని అధికార కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
దీనికి దీటుగు మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి అక్రమంగా పరిహారం పొందారనే ఆరోపణలు రావడంతో సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇలా కన్నడ రాజకీయాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో రసవత్తరంగా మారుతున్నాయి.







