ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు (Telugu States Floods) పోటెత్తడంతో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రజలు వరదల వల్ల భారీగా నష్టపోయారు. ఇంకా చాలా ప్రాంతాలు వరద ముంపు నుంచి కోలుకోలేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం చేసేందుకు టాలీవుడ్ కదిలింది. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే నటులు ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు వెంకీ అట్లూరి, త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, వైజయంతీ మూవీస్ తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి (Donations to CM Relief Fund) రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi Flood Donations) రూ.కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సినీ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (NTR Flood Donations) రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, వైజయంతీ మూవీస్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు అందజేసింది. నటి అనన్య నాగళ్ల రూ.2.5 లక్షలు మొత్తం రూ.5 లక్షలు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించింది.