Mana Enadu:ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాని(Khammam Rains)కి పెద్ద ఎత్తున వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం నగరాన్ని ఎన్నడూ లేనంతగా వాన వణికించేసింది. అక్కడి మున్నేరు వాగుకు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి ముంపు ప్రాంత గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో వరదలతో అల్లాడుతున్న ఖమ్మం ప్రజలకు అండగా తానున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి వారి వద్దకు వెళ్లారు.
ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన
సోమవారం రోజున (సెప్టెంబరు 2వతేదీన) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Khammam Visit) పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి ఉన్నారు.
ఇది చాలా బాధాకరమైన సందర్భం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సందర్భం అని, వరద (Khammam Floods) చాలా మంది బతుకుల్లో విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులంతా నిరంతరం కష్టపడుతున్నారని, మంత్రి పొంగులేటి అయితే నిద్రలేకుండా వరద బాధితులకు అండగా ఉంటున్నారని చెప్పారు. 70 ఏళ్లలో ఇంత భారీ వర్షాన్ని (Heavy Rain) చూడలేదని ఇక్కడి పెద్దవాళ్లు చెబుతున్నారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వారు సర్వం కోల్పోయారని.. ఇన్నాళ్లూ కష్టపడి కొనుక్కున్నవన్నీ నీటిలో మునిగిపోయాయయని అన్నారు.
సర్టిఫికెట్లు పోగొట్టున్న వారికి కొత్తవి
“భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికీ బియ్యం, ఉప్పు, పప్పు, మంచినీరు అందిస్తాం. ఇళ్లు నీట మునిగిన వారిని తక్షణమే గుర్తించి రూ.10వేలు (Financial Assistance) వెంటనే ఇస్తాం. ప్రాణనష్టం జరిగితే రూ.5లక్షలు, పశు సంపద నష్టం వాటిల్లితే రూ.50వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5వేలు చొప్పున ఇస్తాం. ఇల్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన కింద (PM Awas Yojana Scheme) నష్టాన్ని అంచనా వేసి దానికి ఆర్థిక సాయం అందజేస్తాం. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయినవారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.’’ అని సీఎం తెలిపారు.






