మన ఈనాడు:తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.
Telangana Government: యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది. 9 ఏళ్లు క్రితం దరఖాస్తులు చేసుకుంటే.. ఇప్పటికీ అతీగతీ లేని పరిస్థితి నెలకొంది. అదేనండీ రేషన్ కార్డుల అంశం. రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి అవడంతో.. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు రూపొందిస్తోంది ప్రభుత్వం.
అలాగే, ఇప్పుడున్న రేషన్ కార్డులపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను ఉంచాలా? తీసేయ్యాలా? అనే దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలైన అర్హులకే కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే.. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే, కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.