ManaEnadu:జన్వాడ ఫామ్ హౌజ్ రగడ హైకోర్టుకు వరకూ వెళ్లింది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్ హౌజ్ అదే పరిధిలో ఉండటం.. కూల్చివేసే అవకాశం ఉండటంతో ముందస్తుగా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇది కేటీఆర్కు చెందిన ఫాంహౌజ్ అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయి. దీంతో దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు.
ఫాంహౌజ్ వివాదంపై హైకోర్టుకు కేటీఆర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన పేరు మీద ఎలాంటి ఫాంహౌస్ లేదని స్పష్టం చేశారు. తన మిత్రుడికి ఉన్న ఫాంహౌస్ను లీజుకు తీసుకున్నానని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్లో ఫాంహౌస్ ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని తెలిపారు. తప్పు ఉంటే ఫాంహౌస్ను కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించారు. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనని వ్యాఖ్యానించారు. మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన ఫాంహౌస్లు చూపిస్తానని కేటీఆర్ అన్నారు.
“మంత్రి పొంగులేటికి ఎఫ్టీఎల్లో ఫాంహౌస్ ఉంది. కేవీపీ, పట్నం మహేందర్రెడ్డి, సుఖేందర్రెడ్డికి ఎఫ్టీఎల్లో ఫాంహౌస్ ఉంది. సీఎం రేవంత్రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉంది. తప్పు జరిగితే కూల్చివేతకు దగ్గర ఉండి సహకరిస్తాను. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నాకు ఎలాంటి ఇబ్బందిలేదు. తప్పు నేను చేసినా.. కాంగ్రెస్ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. నా అఫిడవిట్లో ఏముందో పబ్లిక్ డాక్యుమెంట్, చూసుకోవచ్చు. రేపు రైతుల తరఫున నేను చేవెళ్లలో నిరసనలో పాల్గొంటాను.” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.