DOC TITLE : Actor Vishal says Tamil Film Industry will also form a committee to probe sexual abuse against lady actors
మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళా నటులపై జరుగుతున్న దారుణాలపై జస్టిస్ హేమ కమిటీ (Justice Hema Committee Report) ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు కేరళలో పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై మలయాళ నటులే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, నిర్మాత విశాల్ హేమ కమిటీ రిపోర్డు, మాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.
మహిళల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన విశాల్ (Actor Vishal).. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి సరైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కమిటీ కోలీవుడ్లోనూ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయం గురించి తమ సంఘం సభ్యులతో చర్చించినట్లు తెలిపారు.
ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్లో(Kollywood News Latest)నూ పలువురు మహిళలు ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిసిందని.. అందుకే తమ చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
హేమ కమిటీ రిపోర్ట్లో పేర్కొన్న విషయాలను చదివి షాకయ్యానన్న విశాల్.. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో ఛాన్సులు ఇస్తాం.. ఫేవర్స్ (Casting Couch) చేయాలంటూ అడిగే వారు ఎంతవారైనా అక్కడే చెంప చెల్లుమనిపించాలని మహిళా నటులకు సూచించారు. మహిళలతో తప్పుగా ప్రవర్తించేవాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా స్పందించి బయటకు చెప్పాలని మహిళలకు విశాల్ సూచనలు చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల(Sexual Harassment in Mollywood) ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదవ్వగా.. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ యాక్టర్, అధికార పార్టీ CPI(M) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్పై రేప్ కేసును నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆ సంఖ్య 18కి చేరింది.






