అహ్మదాబాద్ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా 241 మంది చనిపోగా విశ్వాస్ ఒక్కతే ప్రాణాలతో ఉన్నారు. దీంతో ఆయన ఎలా బ్రతికి బయటపడ్డారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాద క్షణాలను విశ్వాస్ గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికిబయటపడ్డానని వెల్లడించారు.
అందుకే నాకు మంటలు అంటుకోలేదు
‘నేను విమానం లోనుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు’ అని విశ్వాస్ కుమార్ చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని ఓ ఆస్పత్రిలో విశ్వాస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా వాటినుంచి కోలుకుంటున్నారు. తాజాగా డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడారు.
నేను కూడా చనిపోయానని అనుకున్నా..
‘అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నా. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల ధాటికి నా ఎడమ చేయికి గాయమైంది’’ అని విశ్వాస్ తెలిపారు. కాగా చికిత్స పొందుతున్న విశ్వాస్ను శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.






