కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఆమె గురువారం ఉదయం దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు తెలిసింది.
శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్ గంగారాం ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నందీ ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.






