Mana Enadu: ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ 2024పైనే అందరి దృష్టి నెలకొంది. అందులోనూ భారత యువ షూటర్ మను బాకర్ పైనే అందరి కళ్లు. ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు గెలిచి సెన్సేషనల్ విక్టరీ సాధించిన మను ఇప్పుడు హ్యాట్రిక్ విన్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. మూడో మెడల్ పై గురి పెట్టిన మను మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం జరగబోయే ఈ పోటీలో మను గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం.. మను ఖాతాలో హ్యాట్రిక్ ఖాయం.
అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా మనూ బాకర్ గురించే చర్చ నడుస్తోంది. ఈ యంగ్ షూటర్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అనే దానిపై చర్చ నడుస్తోంది. హ్యాట్రిక్ కొట్టినా కొట్టకపోయినా ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు ఈ షూటర్ ను యావత్ భారతావణి మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. అయితే ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి మను పైనే పడింది. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు తమ ఫేస్ గా ఉండాలని కోరుతూ మనును సంప్రదిస్తున్నాయట. తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉండాలని ఇప్పటికే 40 సంస్థలు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మను బాకర్కు సంబంధించిన ఎండార్స్మెంట్లను మేనేజ్ చేసే ఏజెన్సీ సీఈవో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ ముందువరకు ప్రతీ ఎండార్స్మెంట్కు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ఆర్జించేదని.. ఇప్పుడు మాత్రం దాదాపు ఆరు రెట్ల వరకు ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయని ఐఓఎస్ స్టోర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో, ఎండీ నీరవ్ తోమర్ వెల్లడించారు. కేవలం రెండు, మూడురోజుల వ్యవధిలోనే తమకు దాదాపు 40 ఆఫర్లు వచ్చాయని.. అందులో కొన్నింటిని పూర్తి చేసేసినట్లు తెలిపారు.
ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తర్వాత మను బ్రాండ్ విలువ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు పాతిక లక్షల వరకు ఛార్జ్ చేస్తే.. ఇప్పుడు ఒక్కో దానికి దాదాపు రూ.1.5 కోట్లు వరకు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపించాయని హర్షం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదికి ప్రచారకర్తగా ఉండే కేటగిరీలో ఎక్కువ ఎండార్స్మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తానికి ఈ ఒలింపిక్స్ తో మనూ బాకర్ కు పేరుతో పాటు ఇమేజ్ కూడా పెరిగి బ్రాండ్ వాల్యూ అమాంతం ఆకాశానికి వెళ్లిపోయిందన్నమాట.