ఆయనకు ఎనిమిది పదుల వయసు దాటింది. వయసురీత్యా కొన్నేళ్లుగా అనారోగ్యం వెంటాడుతోంది. అలా ఇటీవల శరీరంలో కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే చికిత్సకు కూడా స్పందించకపోవడంతో ఇక బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు. చేసేదేం లేక ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే చనిపోయాడని అనుకున్నారు. ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. ఇంతలో అకస్మాత్తుగా ఆ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జి.సిగడాం మండలం సీతంపేటకు చెందిన ధర్మవరపు అప్పారావు(85) ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించట్లేదని గుర్తించి మరి కొద్దిసేపట్లో చనిపోతాడని ధ్రువీకరించారు.
మరికొద్దిసేపట్లో మరణం
ఇక కుటుంబ సభ్యులు అప్పారావును తీసుకొని అంబులెన్స్లో గ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలోనే ప్రాణం పోయిందని భావించారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని తమ బంధువులకు సమాచారం అందించారు. అంబులెన్సు ఇంటికి చేరుకోగానే అప్పారావును చూసిన ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక దహనసంస్కారాల కోసం శ్మశానానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు
ఇంతలో ఒక్కసారిగా అప్పారావు కళ్లు తెరిచి, కాళ్లు కదిలించాడు. అది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే స్థానిక వైద్యుడిని రప్పించారు. ఆయన పల్స్ ఇంకా కొట్టుకుంటుందని వృద్ధుణ్ని పరిశీలించిన డాక్టర్ చెప్పారు. అంతే ఆ తర్వాత 15 నిమిషాల్లో మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు అప్పారావు. అది చూసి ఊరంతా షాక్ అయింది. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం చాలా సంతోషించారు. ఈ విషయం చుట్టు పక్కల ఊళ్లలో చర్చనీయాంశమైంది.








