మందుబాబులకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బీర్ల ధరలను (Beer Price Hike) 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వేసవిలో హాయిగా చల్లని బీరు తాగుదామనుకున్న వారికి ఇది కాస్త చేదు వార్తే. ధరల నిర్ణయ కమిటీ సిఫారసుల మేరకు పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పెరిగిన బీరు ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఒక్కో బీరుపై రూ.50వరకు పెంపు
ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి సోమవారం రాత్రి బీరు ధరల పెంపుపై ఉత్తర్వులిచ్చారు. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల రేట్లు 15 శాతం పెరగనున్నట్లు రిజ్వీ తెలిపారు. ఈ మేరకు ఒక్కో బీరు బాటిల్పై కనీసం రూ.18 నుంచి గరిష్ఠంగా రూ.50 వరకు పెరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడు పోయేది కింగ్ ఫిషర్ బ్రాండ్ (kingfisher). ఆ తర్వాత టుబోర్గ్, కార్ల్స్బర్గ్, హెయినికెన్, బడ్వైజర్, కరోనా లాంటి బీరు బ్రాండ్లు ఎక్కువగా విక్రయిస్తున్నారు.
ఐదుగురిలో ముగ్గురు బీరు ప్రియులే
రూ.320 రూపాయలు ఉన్న కింగ్ ఫిషర్ అల్ట్రా విట్ బియర్ (kingfisher ultra wit bier) ధర తాజా పెంపుతో రూ.48 పెరిగింది. రూ.230 ఉన్న కరోనా బీరు ధర ప్రస్తుతం 264కు చేరింది. రాష్ట్రంలో మద్యం కంటే అత్యధికంగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు తెలిపాయి. ప్రతి ఐదుగురు మద్యం ప్రియుల్లో కనీసం ముగ్గురు బీరు తాగేవారు ఉన్నారని అధికారులు అంచనా వేశారు.







