ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 36 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. వారి నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని, తాను చూసుకుంటానని భరోసా కల్పించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని, వారికి చెప్పారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ మెరుగైన వైద్యమందిస్తామన్న చంద్రబాబు.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని.. దాని పర్యవసానమే ఈ ప్రమాదం అని అన్నారు.