టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘యజ్ఞం (Yagnam Movie)’ సినిమాలో నాయుడమ్మగా విలనిజం పండించిన ప్రముఖ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) అలియాస్ రాజ్ కుమార్ ఇక లేరు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ మరణించారు. వారం క్రితం హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగులో ఆయన గాయపడ్డారు. చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.
ఎక్కువగా విలన్ పాత్రలు
విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తెలుగు సినిమాల్లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే కనిపించారు. సహాయ పాత్రల్లోనూ అప్పుడప్పుడు అలరించారు. 1994లో వచ్చిన బాలకృష్ణ ‘భైరవ ద్వీపం (bhairava dweepam)’ చిత్రంతో ఆయన తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే యజ్ఞం సినిమాలోని నాయుడమ్మ పాత్ర ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది. విజయ రంగరాజు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు.






