
ఓటీటీలల్లో వస్తున్న కంటెంట్ పై కట్టడి చేయాలన్న డిమాండ్లు చాలా రోజుల నుంచి ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (IGL) కార్యక్రమంలో యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన కామెంట్స్ పెను దుమారం రేపడంతో కేంద్ర ప్రభుత్వం ఓటీటీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ను ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది.
నైతిక విలువలు పాటించాలి
చిన్నారులకు ‘ఎ’ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఓటీటీలను కేంద్రం ఆదేశించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులు అందాయని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. ఐటీ రూల్స్లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ను ఉల్లంఘించే ఏ కంటెంట్ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని ఓటీటీలకు సూచిస్తూ.. స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని పేర్కొంది.
ఐజీఎల్ వివాదంతో కేంద్రం చర్యలు
ఐజీఎల్లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా ఈ విషయం కాస్త సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు రణ్ వీర్ పై తీవ్రంగా మండిపడుతూ.. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా.. అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.