దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై అపారమైన బజ్ నెలకొంది. బుకింగ్స్లోనూ గట్టి పోటీ నెలకొని, దేశవ్యాప్తంగా టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
అయితే ‘కూలీ’ (Coolie)విడుదల సందర్భంగా అభిమానుల ఉత్సాహం మరింత పెరిగేలా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. ముఖ్యంగా, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కు వీరాభిమాని అయిన యూనో ఆక్వా కేర్ సంస్థ యజమాని, రిలీజ్ రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాకుండా ఉచిత సినిమా టికెట్లు కూడా అందజేశారు. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం బ్రాంచ్లలో ఈ ఆఫర్ అమలు చేస్తున్నారు.
అదంతటితో ఆగకుండా, ఆ సంస్థ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు, ప్రజలకు స్వీట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మరిన్ని సంస్థల ఉద్యోగులు కూడా తమ కంపెనీలు ఇలాంటి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.
లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్–ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్లో నాగార్జున, శృతి హాసన్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం అందించిన ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ భారీ హైప్ను క్రియేట్ చేశాయి.






