తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమాని( Women’s Groups)కి మరింత బలోపేతం చేస్తూ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ కింద మరో రూ.344 కోట్లను విడుదల చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించగా, ఈ నిధులు జూలై 18వ తేదీ లోపు సంబంధిత సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామాల నుంచి మండల స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు, ఎమ్మెల్యేల చేత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ సబ్సిడీ కింద రూ.518.69 కోట్లు విడుదల కాగా, తాజా నిధులు కలిపితే మొత్తం మొత్తం రూ.862.04 కోట్లకు చేరింది. ఈ పథకం అమలులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొనబోతున్నారు. వారు వడ్డీ సబ్సిడీ చెక్కులతో పాటు, ప్రమాద బీమా మరియు రుణ బీమా చెక్కులను కూడా పంపిణీ చేస్తారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలకు సరైన నిధులు విడుదల కాలేదన్న ఆరోపణలు వస్తున్న వేళ, 2019 నుంచి 2023 మధ్య రూ.3,075 కోట్లకు పైగా వడ్డీ సబ్సిడీలు బకాయిలుగా ఉండిపోయాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి, మహిళల ఆర్థిక సాధికారతకు నూతన ఊపునివ్వడమే కాక, పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఫోకస్ పెంచింది.






