
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ -2 ఫలితాలు(JEE Main 2025 Results) వచ్చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ(NTA) అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో అర్ధరాత్రి తర్వాత ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో BE/B.Tech కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్
JEE Main పరీక్షలకు దేశ వ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్ చేసుకోగా.. 9,92,350మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు. వీరిలో AP నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి హర్ష్ ఎ.గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ ఉండటం విశేషం. జేఈఈ (మెయిన్) పేపర్ -2 (బీఆర్క్/బి ప్లానింగ్) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు NTA వెల్లడించింది.
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు
కాగా జేఈఈ (మెయిన్) సెషన్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
NOTE: ఫలితాలు, స్కోర్ కార్డు కోసం https://jeemain.nta.nic.in/ను సందర్శించండి.