
తెలంగాణ దక్షిణకాశీ అయిన కాళేశ్వరం(Kaleswaram)లో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleswara Mukteshwara Swami) ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు(Kumbhabhisheka Mahostavalu) నేటి (ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరుగుతుండటం విశేషం. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కుంభాభిషేక మహోత్సవ ప్రారంభ వేడుకల నేపథ్యంలో ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణీ సంగమ గోదావరి(Triveni Sangam Godavari) నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు కలశాలతో గోదావరి జలాలు సేకరించి కుంభాభిషేకానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత గోపూజ, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
అనంతరం అచ్చలాపురం రుత్వికులు(Ruthviks of Acchalapuram) ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. మహోత్సవాల కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవల(Arjitha Seva)ను అధికారులు రద్దు చేశారు. గర్భగుడి దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ మహోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 9న ఉదయం 10:42 గంటలకు తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి(Sachidananda Saraswati Swami) చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరగనుంది.