Mana Enadu : ‘ఓ బాపూ నువ్వే రావాలి – నీ సాయం మళ్లీ కావాలి… జరిగే దుర్మార్గం ఆపాలి – నువ్వే ఓ మార్గం చూపాలి’.. అని ఓ పాటలో ఉన్నట్లు ప్రస్తుతం ఉన్న సమాజానికి కచ్చితంగా బాపూ అవసరం ఉంది. తెల్లవారుజామున లేస్తే ఓవైపు ఆరేళ్ల పసిపాపపై అత్యంత పాశవికంగా అత్యాచారం.. మరోవైపు డబ్బు కోసం కన్నతల్లినే హతమార్చిన తనయుడు.. ఇంకోవైపు భూ తగాదాలతో అన్నను నరికిన తమ్ముడు, ఇలా హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమై పోయాయి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన రోజే స్వాతంత్య్రం వచ్చినట్లు అని ఆనాడు ఆ గాంధీ మహాత్ముడు చెప్పారు.
ఏది బాపూ.. నీవు తెచ్చిన స్వాతంత్య్రం
ఆయన చెప్పినట్లే ఇప్పుడు ఆడవాళ్లు అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా తిరుగుతున్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. కానీ పట్టపగలే ఆడవారిపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. నడిరోడ్డు మీదే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదేనా బాపూ కోరిన స్వాతంత్య్రం. ఇలాంటి దారుణాల కోసమేనా గాంధీ మహాత్ముడు (Mahatma Gandhi) పోరాడి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. ‘ఏది బాపూ! నీవు తెచ్చిన స్వాతంత్య్రం ఎక్కడ?’, స్వేచ్ఛా స్వాతంత్య్రానికి, విశృంఖల విచ్చలవిడి తనానికి మధ్య తేడా తెలియని అయోమయంలో ఉంది నేటి భారతం అనే ఆవేదన గుండెల్లో రగులుతోంది.
అలాంటి మహాత్ముడు ఈ భూమ్మీదకు వచ్చాడంటే
సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస (Non Violence) అనే ధైర్యంతో తెల్ల దొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటుంటే.. ఓ ఆలోచన తడుతోంది. “ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంది”. అని మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ చేసిన వ్యాఖ్యల్లో ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
చిరునవ్వే మన ఆయుధం
సత్యవ్రతం, నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం (Vegetarian) వంటి జీవన విధానంతో బక్క పలచని ఓ మనిషి.. స్వాతంత్య్ర కాంక్ష తన బిక్కు నరాల్లో ఉప్పొంగుతుండగా.. మడమ తిప్పకుండా సత్యమార్గంలో నడిచిన ఆ ఆసేతుహిమాచలాన్ని చూసి ఆంగ్లేయులు గడగడవణికారు. చిరునవ్వే ఆయుధంగా.. సాటిమనిషిపై ప్రేమే మన మాతృభూమిపై గౌరవమని చాటి చెప్పిన ఆ మహనీయుడి అడుగు జాడల్లో నేటి తరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవత్వం మనకు ఎన్నడూ చెరగని అందం అని.. అందానికి మరో సరికొత్త అర్థం చెప్పిన ఆ మహాత్ముడు చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి.
బాపూ బాటే.. మనకు రాచమార్గం
గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti 2024) రాగానే ఆయన ఫొటోలకు పూల దండ వేసి, రెండు నిమిషాల పాటు దేశం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకోవడమే కాదు.. బాపూజీ చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. ఆయన అవలంభించిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబిస్తేనే దేశంలో నేరాలు, అవినీతి, అరాచకాలు ఉండనే ఉండవు. మనమందరం గాంధీజీ ఆచరించి చూపించిన మార్గంలో నడుస్తూ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను గాడిలో పెట్టడమే ఆయనకు ఘటించే నిజమైన అంజలి. అప్పుడే ఆయన తెచ్చిన స్వాతంత్య్రానికి (Independence) అసలైన సార్థకత చేకూరుతుంది.






