Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భూప్రకంపనలు (Earthquake) ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మరోసారి ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో పరుగులు పెట్టించేలా చేశాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం రోజున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.
భయంతో బయటకు పరుగులు
మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడులో స్వల్పంగా భూమి (AP Earthquake News) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి పని అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరిగెత్తారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు కూడా బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
4న భూప్రకంపనలు
ఈనెల 4వ తేదీన కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు (Telangana Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. 4వ తేదీ ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు.. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు తెలిపారు. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని CSIR – NGR శాస్త్రవేత్తలు వెల్లడించారు.






