ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం కొత్త కాదు. కానీ కొన్నిసార్లు మూవీ టైటిల్స్ వివాదాస్పదం అవుతూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కోలీవుడ్ లో ఇద్దరు హీరోలు తమ సినిమాలను ఒకే రోజు ప్రకటించారు. ఇందులో వింతేముంది అంటారా..? ఆ రెండు సినిమాల టైటిళ్లు ఒకటి కావడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
పరాశక్తి టైటిల్ వివాదం
కోలీవుడ్ లో ‘పరాశక్తి (Parasakthi)’ సినిమా టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని (Vijay Antony) తన 25వ సినిమా టైటిల్ ను బుధవారం రోజు ప్రకటించారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర టైటిల్ ను పరాశక్తి అని పెట్టారు. మరోవైపు అమరన్ ఫేం శివకార్తికేయన్ (Shiva Karthikeyan) కూడా బుధవారం రోజునే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ను కూడా పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
తగ్గేదెవరు?
ఇలా ఇద్దరు హీరోలు ఒకే రోజు తమ 25వ సినిమా టైటిల్ ను ఒకటే అనౌన్స్ చేయడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ సినిమా ఛాంబర్లో ఎప్పుడో పరాశక్తి టైటిల్ను రిజిస్టర్ చేయించానని విజయ్ ఆంటోనీ ఓ నోట్ విడుదల చేశాడు. మరో వైపు తాము పరాశక్తి టైటిల్ను ఏవీఎం నిర్మాణ సంస్థ (AVM Productions) నుంచి తీసుకున్నట్టు సుధా కొంగర టీం కూడా ప్రకటించింది. మిగతా భాషల మాట అటుంచితే తెలుగు వెర్షన్లో సేమ్ టైటిల్ పెట్టడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. మరి ఈ రెండు సినిమాలు ఇదే టైటిల్తో విడుదలవుతాయా..? లేక ఇద్దరు హీరోల్లో ఎవరైనా తగ్గుతారా..? అనేది చూడాలి.






