
తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఈ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో గ్రూప్-1 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.
నియామకాలకు లైన్ క్లియర్
అయితే ఈ జీవోను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేయగా ఇవాళ ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నియామకాలకు లైన్ క్లియర్ కావడంతో.. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది. ఇక ఇప్పటికే మార్చి 30వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
వెబ్ సైట్ లో ర్యాంకులు
మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 10వ తేదీన టీజీపీఎస్సీ.. గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసింది. అర్హత సాధించిన 12,622 మందికి సంబంధించి మార్చి 30వ తేదీన జీఆర్ఎల్ లిస్టు రిలీజ్ చేసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో టాప్ 10లో ఆరుగురు మహిళలు ఉన్నారు.