
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Intermediate Board) కీలక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫలితాలు విడుదల చేస్తారని పేర్కొంది.
22న ఇంటర్ ఫలితాలు
విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో ఫలితాలు (Inter Results 2025) చెక్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఒకవేళ ఈ పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయినా ఆందోళన చెందవద్దని విద్యార్థులకు అధికారులు సూచించారు. ఫెయిల్ అయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూమెంట్ పరీక్షలు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఆ పరీక్షల్లో మరింత బాగా చదివి పాస్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.
1532 కేంద్రాల్లో పరీక్షలు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు (Intermediate Exams) నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉన్నారు. 5 లక్షలకుపైగా రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. మార్చి 18వ తేదీ నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం చేసినట్లు వెల్లడించారు.