మన ఈనాడు: 2024-25బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
Kavitha Letter to Batti: ఎన్నికల వేళ బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పెట్టబోయే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయిలు కేటాయించాలని ఈ లేఖలో కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ సంక్షేమానికి రానున్న అయిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల రూపాయిల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని భట్టివిక్రమార్కకు రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. బీసీల సంక్షేమం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుతున్నానని లేఖ రాశారు.
మరోవైపు తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని.. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలు మార్చి లేదా ఏప్రియల్లో జరగనున్న నేపథ్యంలో.. లోక్సభ సీట్ల కోసం అన్ని పార్టీలు తమ వ్యూహలకు పదునుపెడుతున్నాయి. తాజాగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కవిత లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.