Telangana Cabinet Meeting on Runa Mafi Scheme : రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. రుణమాఫీ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈనెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపర నిర్ణయాలపై ఆ భేటీలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు.
పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది.