ManaEnadu:ఏపీలో కురిసిన భారీ వర్షాల (AP Rains)కు ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నష్టపోయాయి. విజయవాడ ఇంకా వరద నీటిలోనే ఉంది. వర్షాలు, వరదలకు రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని (AP Rain Loss Report) తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలు (AP Drop Loss), 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిళ్లడంతో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయినట్లు తెలిపింది.
ఏపీలో వరదలకు 20 మంది మృతి
“మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి (AP Flood Deaths) చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించారు. 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందాయి. 22 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు పాడయ్యాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయి. వర్షం, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారు. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు.” అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) టీంలు రంగంలో దిగాయాని అధికారులు తెలిపారు. ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 228 బోట్లు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని, 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్టు తెలిపారు.
తగ్గుతున్న వరద
మరోవైపు విజయవాడ అజిత్ సింగ్నగర్ ప్రాంతంలో వరద (Vijayawada Floods) తగ్గుముఖం పడుతోంది. సిబ్బంది సహాయచర్యలు ముమ్మరం చేశారు. ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. సహాయచర్యల్లో పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. విజయవాడకు వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు తరలివస్తున్నారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.