ManaEnadu:తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. భక్తుల సౌకర్యార్థం మూడు నెలల ముందుగానే ఆన్ లైన్ ద్వారా .. ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించిన పలు ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు సంబంధించిన టీటీడీ ప్రకటన జారీ చేసింది.
నవంబర్ నెలకు సంబంధించిన.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం.. 21వ తేదీ ఉదయం 10 గంటల దాకా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు దక్కించుకున్న వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లిస్తేనే లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవ టికెట్లు.. వర్చువల్ సేవలు కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
నవంబరు కోటా అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
నవంబర్ కు సంబంధించిన శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను 24వ తేదీన ఉదయం 10 గంటలకు, తిరుపతి, తిరుమలలో గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటా టికెట్లను 27వ తేదీన ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు.